Pages

Subscribe:

Thursday, July 24, 2008

ఒక తలారి కథ....

1940 లో ట్రావంకూరు మహారాజ సంస్థానంలో ఒక తలారి కథ. ఈ తలారి పదవి వంశపారంపర్యంగా వస్తుంటుంది. తలారి కుటుంబం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటుంది. అక్కడైనా మిగతా గ్రామస్తులతో కలవకుండా ఊరికి దూరంగా ఉంటుంది. ఈ వేర్పాటుని ఇంకా నొక్కి చెప్పాలి అన్నట్టు తలారి కుటుంబం అంతా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమిళం మాట్లాడుకుంటారు. ఉరి తీసిన తాడుని తలారికే బహుకరిస్తారు. ఆ తాడు అతని ఇంటిలో కాళికాదేవి పూజాస్థలం ముందు వేళాడుతుంటుంది. ఆ తాడుముక్కతో అమ్మవారికి దీపారాధన వెలిగించి ఆ బూడిద విభూతి పెడితే అన్ని రోగాలూ పోతాయని గ్రామస్తుల నమ్మకం.

ఇప్పటి తలారి కాళియప్పన్ వృద్ధుడైపోయాడు. పైగా అంతకు ముందు ఉరితీసిన ముద్దాయి నిర్దోషి అని నమ్మి, అతని ప్రాణం తీసిన పాపం వొడిగట్టుకున్నాను అనే పాపచింతనతో పగలూ రాత్రి అదే పనిగా తాగి కాలం గడుపుతున్నాడు. కొడుకు ముత్తు పై ఊళ్ళకి చదువుకి వెళ్ళి గాంధీ గారి సత్యాగ్రహ సూత్రాల్ని వంటబట్టించుకుని తిరిగి వచ్చాడు. రాట్నం వడుకుతుంటాడు. పెళ్ళై కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు తనకింకా ఏవో పుట్టింటి కట్నాలు దక్కలేదని దెప్పుతూంటుంది. చిన్న కూతురు అప్పుడే పెద్దమనిషైంది. ఈ విచిత్ర కుటుంబాన్ని కట్టి ఉంచే సూత్రధారిణిగా కాళియప్పన్ అర్ధాంగి మరగతం అందర్నీ కను రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది.

ఇంతలో రాజాస్థానపు ఉద్యోగి తలారిని వెదుక్కుంటూ వస్తాడు. హత్య చేసిన నేరానికి ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధించారనీ, శిక్ష ఫలానీ రోజున అమలు జరుగుతుందనీ, ఆ దండన అమలు జరిపేందుకు తలారి అవసరమైన పూజాదికాలు నిర్వహించి సిద్ధంగా ఉండవలసిందని రాజాజ్ఞగా వినిపిస్తాడు. తాను వృద్ధుణ్ణైపోయాననీ, వేరెవర్నైనా ఈ పనికి చూసుకోవలసిందనీ కాళియప్పన్ ప్రార్ధిస్తాడు. తలారి పదవిలో రాజుగారి దయచేసిన వసతూన్నీ ఇన్నాళ్ళూ హాయిగా అనుభవించి ఇప్పుడు రాజధిక్కారం చేస్తావా అని గద్దిస్తాడు ఉద్యోగి. విధిలేక వల్లెయన్నాడు కాళియప్పన్. ఆ రోజు నించీ నిత్యం స్నాన జపతపాల్లో గడుపుతున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తోంది. చివరికి బయల్దేరే రోజు రానే వచ్చింది. కొడుకుని సాయంగా తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ ఉరి తాడునీ, యంత్రాన్నీ పరీక్షిస్తాడు.

ఆ రాత్రి అతనికి శివరాత్రే. ముద్దాయి ఎలాగూ ఆ రాత్రి నిద్ర పోలేడు కాబట్టి తలారి కూడా జాగారం చేయ్యాలని అదొక ఆచారం. జైలర్లు అతనికి తోడు కూర్చుని, సారాయి తాగిస్తూ, నిద్ర పోకుండా ఒక కథ చెప్పటం మొదలు పెడతారు. ఒక పెల్లలో ఒక అమాయకపు పడుచు పిల్ల తన మేకని మేపుకుంటుంది. ఒక అనాథ యువకుడు పిల్లంగ్రోవి ఊదుకుంటూ అక్కడ పచ్చిక బయళ్ళలో తిరుగుతుంటాడు. ఇద్దరూ తారసపడతారు. త్వరలో అది పరస్పరం ఇష్టంగా ప్రేమగా పరిణమిస్తుంది. ఇంతలో ఆమె అక్క మొగుడు వీళ్ళని చూస్తాడు. ఆ యువకుడు అవతలికి వెళ్ళిన సమయంలో ఆ పిల్లని సోంత బావే బలాత్కరించి చంపేస్తాడు. ఆ ప్రదేశంలో అనాథ యువకుడి పిల్లంగ్రోవి విరిగిపోయి కనిపిస్తుంది. అతను దోషిగా నిరూపించబడతాడు. చనిపోయిన పిల్ల కుటుంబానికి అసలు ముద్దాయి ఎవరో తెలుసు, కానీ వారతన్ని బయట పెట్టరు. కథ ఇంతవరకూ విన్న కాళీయప్పన్ తాగిన మైకంలో "మరి ఆ అబ్బాయి ఏమయ్యాడు" అని అరుస్తాడు. కథ చెప్పిన జైలరు నవ్వుతూ "ఏమవుతాడు? వాణ్ణే నువ్వు రేపు ఉరి తియ్య బోయేది!" అంటాడు. ఇంకో నిర్దోషిని ఉరితియ్యడమనే ఊహ భరించలేక గుండె పోటు వచ్చి కాళీయప్పన్ మరణిస్తాడు.

కానీ రాజాజ్ఞ అమలు జరగాలి. సత్యాహింసలు తన దైవాలుగా నమ్మిన ముత్తు తండ్రి కాళీయప్పన్ కి వారసుడిగా తలారి పాత్ర ధరించి మొదటి ఉరి తీస్తాడు.
ఇదంతా ఇలా ఉండగా, జైలరు ఆ అమాయకపు పడుచు పిల్ల కథ చెబుతున్నప్పుడు తలారి దృష్టిలో అది తన చిన్నకూతురిలాగా, ఆ హీనమైన అకృత్యం చేసేవాడు తన అల్లుడిగా కనిపిస్తారు. ఇది (సినిమా కథలో) నిజంగా జరిగింది కాదు. కానీ ఆ ఊహ అతన్ని ముదలంటా కుదిపేసి మరణానికి దారి తీస్తుంది. ఒక విధంగా పసితనపు అమాయకత్వానికీ, కర్కశమైన న్యాయవిధానానికీ, మధ్యలో నిమిత్తమాత్రమైన అసహాయత్వానికీ ఒక త్రికోణపు సంబంధంలా అనిపిస్తుంది.

1 Comment:

  1. live sports streaming said...
    watch live sports free

Post a Comment